*సెల్ఫ్ స్టేజ్ క్యాప్చర్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి*
*ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులకు కలెక్టర్ పిలుపు*
*క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశం*
నిజామాబాద్, ఏప్రిల్ 28 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పథకంలో పారదర్శకతను పెంపొందించేందుకు “సెల్ఫ్ స్టేజ్ క్యాప్చర్ సిస్టమ్”ను అమలు చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ విధానం ద్వారా ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ దశలను వారే స్వయంగా మొబైల్ ఫోన్ ద్వారా ఫోటోలు తీసి, ప్రభుత్వ పోర్టల్లో అప్లోడ్ చేసే అవకాశం కల్పించబడిందని తెలిపారు. మంగళవారం ఐ.డీ.ఓ.సీలో ఎంపీడీఓలు, తహసిల్దార్లు, హౌసింగ్ ఏ.ఈలతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా కలెక్టర్ సెల్ఫ్ స్టేజ్ క్యాప్చర్ విధానం గురించి కలెక్టర్ ప్రస్తావిస్తూ, క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు ఈ విధానంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ విధానంలో ఇందిరమ్మ లబ్ధిదారులు పునాది దశ, గోడల నిర్మాణం, పైకప్పు, పూర్తి స్థాయిలో నిర్మాణం వంటి నాలుగు దశలలోనూ ఫోటోలను వారే స్వయంగా తీసి ఇందిరమ్మ ఇల్లు పోర్టల్ లో అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించారని అన్నారు. ఇవి సంబంధిత అధికారులకు నేరుగా చేరి, నిర్మాణ పనుల పురోగతిని వేగంగా పరిశీలించేందుకు ఉపకరిస్తుందని, సంబంధిత పంచాయతీ కార్యదర్శి, వార్డు అధికారి, హౌసింగ్ అధికారి వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా లబ్దిదారులే సెల్ఫ్ స్టేజ్ క్యాప్చర్ సిస్టమ్ ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. దీనివల్ల లబ్ధిదారులకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిభారం ఉండదని, నిర్మాణ దశల ధృవీకరణ వేగవంతం అవుతుందని, నిధుల విడుదలలో అనవసర జాప్యం నివారించబడుతుందని కలెక్టర్ సూచించారు. అన్నింటికి మించి ఈ పథకం అమలులో పారదర్శకత పెంపొందించబడుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని లబ్దిదారులు సెల్ఫ్ స్టేజ్ క్యాప్చర్ సిస్టమ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.























