ఇందూరు అర్బన్..దేశభక్తి, సేవాభావం, వ్యక్తిత్వ వికాసం వంటి మహత్తర లక్ష్యాలతో సమాజంలో సంఘ్ చేస్తున్న సేవలను అభినందించారు. ఇందూరులోని గిరిరాజ్ కాలేజ్ మైదానం, దుబ్బా ప్రాంతంలో నిర్వహించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నగర శాఖల సంగమం కార్యక్రమానికి ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 1925 విజయదశమి పర్వదినాన స్థాపించబడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్దోత్సవ వేడుకల సందర్భంగా
నగరంలోని అన్ని శాఖలను ఒకే వేదికపై సమీకరించి ఈ సంగమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ఐక్యత, సోదరభావం, శిస్తు, సేవాస్పూర్తి పెంపొందించడంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాత్ర విశేషమని పేర్కొన్నారు. యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్త శ్రీ కల్లూరి ప్రభు కుమార్ ప్రసంగించి సంఘ్ సిద్ధాంతాలు, శతాబ్ద ప్రయాణం, భవిష్యత్ కార్యాచరణపై వివరణ ఇచ్చారు.అనంతరం మాట్లాడుతూ ఈ రోజు కార్యక్రమంలో 50 బస్తీల శాఖలు పాల్గొన్నాయని ఇందూరు నగరంలో ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వచ్చే సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో 75 బస్తీల నుండి శాఖలు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. నగరంలోని స్వయంసేవకులు, ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.























