ఇందూరు అర్బన్.. పాత్రికేయుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను పత్రికల మరియు వివిధ ఛానల్లో ప్రసారం చేస్తూ ప్రభుత్వాలను మేలుకొల్పే దిశగా పాత్రికేయులు నిరంతరం కృషి చేస్తారని ఆయన కొనియాడారు. కనీసం పాత్రికేయులు నివసించడానికి సొంత ఇండ్లు లేని పరిస్థితి నిజామాబాద్ జర్నలిస్టులకు ఉందని ఆ విషయాన్ని పలుమార్లు కొందరు జర్నలిస్టులు తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు.
సోమవారం బస్వా గార్డెన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడింది నూటికి నూరు శాతం వాస్తవమేనని ఇళ్ల స్థలాల కోసం గత కొన్నేళ్లుగా పత్రికేయులు ఉద్యమాలు చేస్తున్నారని ప్రభుత్వాల గురించి ప్రభుత్వాల సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియపరిచే వారి పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కావాలని గత కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నారని అయినా ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని రూరల్ ఎమ్మెల్యే కి సూచించిన విధంగా ఆ ప్రాంతంలో జర్నలిస్టులకు భూములు కేటాయిస్తే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు
చాలా దినపత్రికల్లో జర్నలిస్టులకు వేతనాలు కూడా రావడం లేదని అయినాసరే ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుక వెళ్లాలనే సంకల్పంతోనే ఈ రంగంలోనే నెట్టుకు వస్తున్నారని ఆయన అన్నారు. అందుకే మీడియా ప్రతినిధులను, పాత్రికేయ రంగంలో పనిచేసే విలేఖరులను ప్రభుత్వాలు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.























