గ్రామ, వార్డు సభలను అట్టహాసంగా నిర్వహించాలి
అమలవుతున్న సంక్షేమ పథకాలు, జూన్ 2 నుంచి అమలు చేయబోతున్న కొత్త పథకాల గురించి వివరించాలి
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నిజామాబాద్, మార్చి 31 :ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామ, వార్డు సభలను అట్టహాసంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రజాభవన్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. గ్రామ, వార్డు సభలు నిర్వహించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహాలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి గారి సందేశం వినిపించి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చదివి వినిపించాలని సూచించారు. రైతు భరోసా లబ్ధిదారుల పేర్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను సాధ్యమైనంత వరకు గ్రామ సభలో చదివి వినిపించాలని ఆదేశించారు. ఇప్పటివరకు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, జూన్ 2 నుంచి అందరికీ జీవిత బీమా అమలు చేయబోతున్న విషయాన్ని వివరించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందించనున్న విషయాలను వివరించాలని దిశా నిర్దేశం చేశారు. అల్పాహారం కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల పాటు గ్లాస్ పాలు, మూడు రోజుల పాటు రాగి జావా అందిస్తున్న విషయాన్ని వివరించాలన్నారు. ఇంటర్ కళాశాలల విద్యార్థులకు కొత్తగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం అందరికీ అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు. వీటిని వివరించే క్రమంలో సాంస్కృతిక శాఖ, పౌర సంబంధాల శాఖ సహాయ సహకారాలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నామని, గ్రామాల వారీగా విడుదలైన నిధుల వివరాలను అందుబాటులో పెట్టుకుని గ్రామసభ రోజు ఆ గ్రామానికి ఎంత మేరకు నిధులు కేటాయించబడ్డాయి అనే వివరాలు ప్రకటించాలని అన్నారు.
ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం అవుతున్న తీరును ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ, ప్రణాళికా శాఖ జిల్లా కలెక్టర్ ల నుంచి సమాచారం సేకరిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవా రంగాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, గ్రామ వార్డు సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఉదయం 7.30 గంటల నుంచి 10.30 గంటల లోపు సభలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించి క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులను సమాయత్తం చేశామన్నారు. అన్ని వర్గాల ప్రజలను, ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేస్తూ జిల్లాలో గ్రామ, వార్డు సభలను విజయవంతం చేస్తామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డీపీఓ శ్రీనివాస్, సీపీఓ రతన్ తదితరులు పాల్గొన్నారు.























