ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు
అత్యవసరమైతేనే బయటికి రావాలి ఉదయం వేళల్లో పనులు చేసుకోవాలి
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి తల్లితండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి
ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. రానున్న రోజుల్లో నిజామాబాద్ సహా ఇతరత్రా జిల్లాల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని అందులో నిజామాబాద్ జిల్లా సైతం ఉందన్నారు. కావున ప్రజలు ఎండల బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. పనుల్లోకి వెళ్ళే వారంతా ఉదయం పూటే పనులు ముగించుకుని ఇంటికి చేరుకోవాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు.
ఇక ఎండ నుండి ఉపశమనం కోసం శీతలపానీయాలు, డి హైడ్రేషన్ కు గురికాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ఉపయోగించాలని సూచించారు. పిల్లలు మరిన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ నెల 24 నుండి పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లల పై తల్లితండ్రులు నిత్యం శ్రద్ధ వహించాలని సూచించారు. వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.

























