381 విజయవంతమైన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు.. యశోద హాస్పిటల్స్ అరుదైన రికార్డు
నిజామాబాద్, జూన్ 20: హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ కిడ్నీ చికిత్స విభాగం అరుదైన మైలురాయిని చేరుకుంది. ప్రముఖ నెఫ్రాలజిస్టులు డాక్టర్ రాజశేఖర చక్రవర్తి, డాక్టర్ పి. విజయ్ వర్మ నేతృత్వంలోని వైద్య బృందం ఇప్పటివరకు 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి అనేక మంది రోగులకు నూతన జీవితం ప్రసాదించింది.
నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైద్య నిపుణులు కిడ్నీ మార్పిడి రంగంలో తాము సాధించిన విశేష పురోగతిని వివరించారు. సాధారణంగా కిడ్నీ మార్పిడికి దాత, గ్రహీత రక్త గ్రూపులు సరిపోవడం అవసరమని, అయితే యశోద హాస్పిటల్స్లో అత్యాధునిక వైద్య సాంకేతికత సహాయంతో రక్త గ్రూపులు వేర్వేరుగా ఉన్న రోగులకు కూడా విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వయస్సు అడ్డంకి కాదు
కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల విషయంలో వయస్సు అడ్డంకి కాదని యశోద వైద్య బృందం నిరూపించిందన్నారు. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు సైతం విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేసి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచినట్లు వెల్లడించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ విజయాలను సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ పి. విజయ్ వర్మ మాట్లాడుతూ, “కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు డయాలసిస్ తాత్కాలిక ఉపశమనం మాత్రమే. కిడ్నీ మార్పిడి ద్వారా రోగులు సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం లభిస్తుంది. మేము విజయవంతంగా పూర్తి చేసిన 381 ట్రాన్స్ప్లాంట్లు కేవలం ఒక సంఖ్య కాదు.. 381 కుటుంబాల్లో వెలుగులు నింపిన విజయగాథలు. రక్త గ్రూపులు వేరైనా కిడ్నీ మార్పిడి సాధ్యమే అనే అవగాహన ప్రజల్లో పెరగాలి” అని అన్నారు.
యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో కిడ్నీ సంబంధిత వ్యాధులకు అంతర్జాతీయ ప్రమాణాలతో చికిత్స అందిస్తూ, దేశంలోనే ప్రముఖ ట్రాన్స్ప్లాంట్ కేంద్రంగా గుర్తింపు పొందుతోంది.























