నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలను ఆలకించారు. ఇందులో భాగంగానే డిచ్ పల్లి మండలం దూస్ గాం గ్రామంలో
పాత చెరువులో పూడికతీత చేపట్టాలని స్థానిక సర్పంచ్ వెంకటేష్ నేతృత్వంలో గ్రామస్తులు ఎమ్మెల్యే ను కలిసి విన్నవించారు. గ్రామంలోని పాత చెరువులో పేరుకుపోయిన నల్ల మట్టి పూడికతీత చేపట్టి… నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించేలా చొరవ చూపాలని కోరారు. కాగా ఓపిగ్గా వారి సమస్యలను విన్న ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.























