అంగన్వాడీ సిబ్బందికి భారీ ఊరట
ఎన్నికల్లో ఓడి ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు, హెల్పర్ల పునర్నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, జూన్ 14:
రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, ఎన్నికల్లో ఓడిపోయిన అంగన్వాడీ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకునే (పునర్నియామకం) ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) ప్రత్యేక చొరవతో ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసినందుకు అంగన్వాడీ మహిళలు తమ ఉపాధిని కోల్పోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు క్షేత్రస్థాయిలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్య సంరక్షణలో అత్యంత కీలకమైన సేవలు అందిస్తున్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె వివరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీనామా చేసి, ఎన్నికల్లో విజయం సాధించని అంగన్వాడీ సిబ్బంది సమర్పించే దరఖాస్తులను నిబంధనల ప్రకారం అధికారులు పరిశీలించనున్నారు. అయితే, సదరు అంగన్వాడీ టీచర్ లేదా హెల్పర్ రాజీనామా చేసిన పోస్టులో ఇప్పటివరకు కొత్త నియామకం జరగకుండా ఆ స్థానం ఖాళీగా ఉన్న సందర్భాల్లో మాత్రమే పునర్నియామకానికి అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి అనితా రామచంద్రన్ దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న అనేక మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల కుటుంబాల్లో మళ్లీ ఆశలు చిగురించనున్నాయి. అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, వీలైనంత త్వరగా వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని జిల్లా సంక్షేమ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

























