ఆర్టీసీ విలీన ప్రక్రియకు వేగం.. త్వరలో యూనియన్ వెరిఫికేషన్
ఉద్యోగుల అభిప్రాయాలతోనే తుది నిర్ణయం – నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి.కె. మూర్తి
నిజామాబాద్, జూన్ 13 (త్రిశూల్ న్యూస్): టీజీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉందని నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి.కె. మూర్తి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన విలీన ప్రక్రియ తాజా పురోగతిపై వివరాలు వెల్లడించారు.
ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల చిరకాల స్వప్నమైన ప్రభుత్వ విలీన అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తోందన్నారు. గత ఏప్రిల్లో జరిగిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ మూడు కీలక అంశాలను పరిశీలించి సానుకూల నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. అందులో 2021 వేతన సవరణ, కార్మిక సంఘాల పునరుద్ధరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాలు ఉన్నాయని వివరించారు.
విలీన ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ ఇప్పటికే సమావేశమై విలీనానికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించిందని తెలిపారు. సమ్మె సమయంలో మిగిలిన డిమాండ్లపై ఆర్టీసీ ఈడీల కమిటీ కార్మిక సంఘాలతో చర్చలు కొనసాగిస్తోందన్నారు.
విలీన ప్రక్రియలో ప్రతి కార్మికుడి స్వరం వినిపించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలలో కార్మిక శాఖ పర్యవేక్షణలో పారదర్శకంగా యూనియన్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు.
కార్మిక సంఘాల నుంచి వచ్చే సూచనలు, సలహాలను క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలనకు పంపించి, అందరికీ ఆమోదయోగ్యంగా, నూటికి నూరు శాతం పారదర్శకతతో విలీన తుది ప్రక్రియను పూర్తి చేస్తామని మూర్తి స్పష్టం చేశారు.
ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తుకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, ఎప్పటిలాగే విధులను అంకితభావంతో నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి సహకరించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
– త్రిశూల్ న్యూస్, నిజామాబాద్

























