కామ్రేడ్ భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురు ల 95వ వర్ధంతి సందర్భంగా
*తె.యూలో PDSU విప్లవ నివాళి*
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో భారత జాతీయోద్యమ వీరులు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95 వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు కామ్రేడ్ భగత్ సింగ్ చిత్రపటానికి విప్లవ నివాళి అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా *తె.యూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాంబాబు మాట్లాడుతూ*
భారత దేశ విముక్తి కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూ నూనూగు మీసాల నవయవ్వనంలోనే ఉరికొయ్యలకు వేలాడిన భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ల ప్రాణ త్యాగాలు వెలకట్టలేనివని, వారి పోరాట స్ఫూర్తి నేటి విద్యార్థి, యువతకు సదా ఆదర్శమన్నారు.
*PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్ మాట్లాడుతూ*
దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత జాతీయ ఉద్యమ వీరుల ఆకాంక్షలను పూర్తిగా విస్మరిస్తూ దేశ సార్వభౌమత్వాన్ని అమెరికా అగ్రరాజ్యానికి తాకట్టు పెడుతూ, దేశ సంపదను స్వదేశీ, విదేశీ కార్పోరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం దేశంలోని రాజ్యాంగ బద్ధ సంస్థలను చెప్పు చేతుల్లో పెట్టుకొని దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ, పౌరుల ప్రజాస్వామిక హక్కులను, భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని, దేశ లౌకిక వ్యవస్థను విచ్చిన్నం చేసే కుట్రలకు పాల్పడుతున్నదన్నారు.
నూతన జాతీయ విద్యా విధానం- 2020 పేరిట విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానం, ప్రశ్నించే తత్వాన్ని దూరం చేస్తుందన్నారు. పాఠ్యపుస్తకాల్లో నుంచి జాతీయ ఉద్యమ వీరుల పోరాట త్యాగాలను, సమానత్వాన్ని బోధించే సోషలిస్టు భావాలను, డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాలను తొలగించి, కుల, మత, మనువాద, అశాస్త్రీయ భావాలను ప్రవేశ పెడుతున్నదన్నారు.
నేటి విద్యార్థి, యువత భగత్ సింగ్, రాజ్ గురు,సుఖ్ దేవ్ ల పోరాట స్ఫూర్తితో విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాడాలని, ఇరాన్ పై ఇజ్రాయిల్ -అమెరికా కొనసాగిస్తున్న యుద్ధోన్మాధ దాడులను ఖండించాలని, దేశంలో రోజురోజుకు పెట్రేగిపోతున్న కుల, మతోన్మాద పాసిజాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో PDSU తెలంగాణ యూనివర్సిటీ నాయకులు నితిన్, అంజలి, హేమ, రాజేష్, తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపకులు లక్ష్మణ చక్రవర్తి, స్వామి, శ్రీనివాస్, పుప్పాల రవి తదితరులు పాల్గొన్నారు.

























