నిజామాబాద్ జిల్లాలో 55 బ్లాక్ స్పాట్లను సందర్శించిన ఎస్ఐలు , సిఐలు , ఏసీపీలు , అదనపు డీసీపీ మరియు పోలీస్ కమిషనర్
ఫ్లోరోసెంట్ పెయింటింగ్ మరియు రేడియం స్టిక్కర్ తో కూడినటువంటి పోలీస్ కటౌట్ ల ఏర్పాటు
శనివారం నాడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోగల 55 బ్లాక్ స్పాట్లను పోలీసులు సమగ్రంగా గుర్తించి పర్యవేక్షించారు. ఎస్సైలు , సీఐలు , ఏసీపీలు , అదనపు డీసీపీ (అడ్మిన్)తో పాటు పోలీస్ కమిషనర్ స్వయంగా ఈ ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఏడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట దర్గా వద్ద *నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* పర్యవేక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రమాదాలకు ప్రధాన కారణాలైన అధిక వేగం , రోడ్డు వంపులు , స్పష్టమైన సూచిక బోర్డుల లేమి , రాత్రివేళలలో తగిన లైటింగ్ లేకపోవడం వంటి అంశాలను గుర్తించారు. వీటిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
బ్లాక్ స్పాట్లలో తక్షణ చర్యలుగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం , ఫ్లోరోసెంట్ పెయింటింగ్ మరియు రేడియం స్టిక్కర్ తో కూడినటువంటి పోలీస్ కటౌట్ లో ఏర్పాటు , స్పీడ్ బ్రేకర్లు నిర్మించడం , రోడ్డు మార్కింగ్లు స్పష్టంగా వేయడం , స్ట్రీట్ లైటింగ్ మెరుగుపరచడం వంటి పనులు చేపట్టాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణను పెంచి , నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదనంగా, డ్రైవర్లలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని , హెల్మెట్ వినియోగం , సీట్ బెల్ట్ తప్పనిసరి పాటించడం వంటి అంశాలపై కట్టుదిట్టంగా అమలు చేయాలని పేర్కొన్నారు.
ప్రజలు కూడా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి, ప్రమాదాల నివారణలో పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా సమగ్ర చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.





















