కళ్యాణ లక్ష్మి డబ్బులను పెంచాలి
వీలైంత తొందరగా డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇవ్వాలి
చెక్కుల పంపిణీ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా..
ఇందూరు: రాష్ట్ర ప్రభుత్వం తులం బంగారం ఇవ్వకున్నా.. కనీసం కల్యాణ లక్ష్మి నగదునైనా పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. జిల్లాకేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సోమవారం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎలాగో నెరవేర్చడం లేదని అన్నారు. కనీసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిధులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధానంగా దళారులను ఆశ్రయించకుండా నేరుగా అధికారులను సంప్రదించాలన్నారు. అలాగే నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటివరకు ఒక్కటి కూడా కేటాయింకాలేదన్నారు. అర్హులైన పేదలు ఎందరో ఉన్నారని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందజేయాలన్నారు. మొత్తం రూ.5.91 కోట్ల విలువ గల 591 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నగర మేయర్ ఉమారాణి, బిజెపి కార్పొరేటర్లు పాల్గొన్నారు.























