ప్లాస్టిక్ నిర్మూలనకు వినూత్న చర్య…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని గుడితండాలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పంచాయతీ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల కోసం స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మారుతి, ఎంపీఓ శ్రీధర్, సర్పంచ్ సరస్వతి రమేష్ నాయక్, ఉప సర్పంచ్ మోహన్ నాయక్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. పండుగలు, సామూహిక కార్యక్రమాల సందర్భంగా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, ఇతర ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరుగుతోందని తెలిపారు. దీని వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని పిలుపునిచ్చారు.
అన్నదాన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లను వినియోగించడం ద్వారా ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. స్టీల్ ప్లేట్లను పదేపదే ఉపయోగించుకోవచ్చని, తద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని సూచించారు.
గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని మండపాల నిర్వాహకులు కూడా ప్లాస్టిక్ ప్లేట్లను ఉపయోగించకుండా స్టీల్ ప్లేట్లు, పునర్వినియోగ వస్తువులను వినియోగించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా పండుగల సమయంలో పర్యావరణహిత పద్ధతులను పాటించాలనే సందేశాన్ని గ్రామ ప్రజలకు అందించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి.. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

























