ఆయిల్ పామ్ లక్ష్య సాధనకు ప్రణాళికాబద్దంగా కృషి చేయాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, మార్చి 26 : నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో ఆయిల్ పామ్ సాగు జరిగేలా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. క్షేత్రస్థాయిలో రైతులను ప్రోత్సహిస్తూ జిల్లాలో ఈ ఏడాది 7 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరిగేలా అంకిత భావంతో పని చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖల అధికారులతో, ఆయిల్ పామ్ నర్సరీని నిర్వహిస్తున్న ప్రీ-యునిక్ కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు పురోగతిపై క్లస్టర్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని, ఎంతో లాభదాయకమైన ఈ పంట సాగును చేపట్టి రైతులు ఆర్ధిక అభ్యున్నతి సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ పంట వల్ల కలిగే ప్రయోజనాల గురించి రైతులకు సరైన విధంగా అవగాహన కల్పిస్తూ క్షేత్రస్థాయి అధ్యయన యాత్రల ద్వారా వారిలో నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. అన్ని రైతు వేదికలలో విరివిగా సమావేశాలు నిర్వహిస్తూ, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, మద్దతు ధర, సుదీర్ఘ కాలం పాటు ఏటేటా సమకూరే రాబడి, అంతర పంటల సాగుకు గల అవకాశాలు తదితర అంశాలను వివరించాలని, ఆదర్శ రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ముందుకు వచ్చేలా చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. జిల్లాలో త్వరలోనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుందని, దీని కోసం అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనివల్ల కంపెనీ వారు రైతుల వద్దకే వచ్చి పంట దిగుబడి సేకరించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు. ఇప్పుడు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కలెక్షన్ సెంటర్లను అందుబాటులో ఉంచామని తెలిపారు.
జిల్లాలో 2022-23వ సంవత్సరం నుండి ఆయిల్ పామ్ సాగుకు శ్రీకారం చుట్టగా, ఇప్పటివరకు 2375 మంది రైతులు 6164 ఎకరాల విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారని కలెక్టర్ వివరించారు. మూడు సంవత్సరాలు దాటిన మీదట పంట దిగుబడులు కూడా చేతికి అందడం ప్రారంభం అయ్యిందని తెలిపారు. సుమారు 1476 ఎకరాలలో ఆయిల్ పామ్ గెలలు కోతకు వచ్చాయని, తద్వారా రైతుల ఖాతాలలో 2.50 కోట్ల రూపాయల డబ్బులు కూడా జమ అయ్యాయని అన్నారు. అంకాపూర్ లో మార గంగారెడ్డి, కోటగిరి మండలం ఎత్తొండలో ఎం.రమాదేవి, అర్గుల్ లో మధుసూదన్ రెడ్డి, కొప్పెర్ల గంగారం తదితర ఆదర్శ రైతులు ఇప్పటికే ఆయిల్ పామ్ సాగు ద్వారా లాభాలు పొందుతున్నారని, రైతులు వారి తోటలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పరిశీలన జరిపేలా అధ్యయన యాత్రలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు కోసం సరిపడా మొక్కలు అందుబాటులో ఉన్నాయని, ఒక్కో మొక్క ధర 193 రూపాయలు కాగా, రైతులు కేవలం 20 రూపాయలు చెల్లిస్తే, ప్రభుత్వం 173 రూపాయల సబ్సిడీ సమకూరుస్తోందని అన్నారు. అంతేకాకుండా పంట సాగు కోసం నాలుగు సంవత్సరాల పాటు ఎకరానికి 4200 రూపాయల చొప్పున ఆర్ధిక తోడ్పాటును, డ్రిప్ ఇరిగేషన్ కోసం ఎస్సీ, ఎస్టీ లకు 100 శాతం, ఇతరులకు 90 శాతం సబ్సిడీని అందిస్తోందని వివరించారు. ఆయిల్ పామ్ పంటకు కోతులు, పశువుల బెడద వంటివి ఉండవని, తక్కువ ఖర్చుతో సుదీర్ఘ కాలం పాటు సుమారు 30 సంవత్సరాలు దిగుబడి పొందవచ్చని సూచించారు. ఏ రకంగా చూసినా ఆయిల్ పామ్ సాగు ఎంతో లాభదాయకమైనందున రైతులను ఈ పంట సాగు దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున తోడ్పాటును అందిస్తోందని అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, ఆయిల్ పామ్ సాగు లక్ష్య సాధన కోసం ఉద్యానవన శాఖకు అవసరమైన తోడ్పాటును అందించాలని వ్యవసాయ, సహకార శాఖల అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారులు జె.గోవిందు, వీరస్వామి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ రావు, ప్రీ యునిక్ కంపెనీ ఏరియా మేనేజర్ సాయి కిరణ్, ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులు, ఏ.ఓలు, ఏఈఓలు పాల్గొన్నారు.

























