*రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు*
కలెక్టర్ ఇలా త్రిపాఠి
*రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో దిశా నిర్దేశం*
నిజామాబాద్, మార్చి 31 : రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తే, ప్రమాదాలకు ఆస్కారం ఉండదని అన్నారు. ఈ దిశగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా చైతన్యపర్చేందుకు కృషి చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరుగగా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. నేషనల్ హైవే అథారిటీ, ఆర్ అండ్ బి, రవాణా శాఖ, ఆర్టీసీ, పంచాయతీ రాజ్, విద్యుత్, వైద్యారోగ్యం, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో పాటు రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న 55 బ్లాక్ స్పాట్ ప్రాంతాల గురించి, ప్రమాదాలకు గల కారణాలపై సమావేశంలో చర్చించి పలు సూచనలు చేశారు. ప్రమాదాలను నిలువరించేందుకు ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యల గురించి కలెక్టర్ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం లైన్ డిపార్ట్ మెంట్స్ కు చెందిన అధికారులు పరస్పర సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలన్నారు. సాయంత్రం ఐదు గంటల తరువాత ఇసుక లోడ్ తో కూడిన వాహనాలు తిరగకుండా నిఘా ఉంచాలన్నారు. స్కూల్ బస్సుల తనిఖీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి వాహనం తగిన ఫిట్ నెస్ కలిగి ఉండాలన్నారు. వరి కోతల సమయంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఓవర్ లోడ్ తో వెళ్ళే వాహనాలను నియంత్రించేలా కార్యాచరణ అమలు చేయాలన్నారు. అతి వేగం, తాగి వాహనాలు నడపడం, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్ధాలను తెలియజేస్తూ విద్యార్థులకు, వాహన డ్రైవర్లకు, ప్రజలకు అవగాహన పెంపొందేలా విరివిగా ప్రచారం నిర్వహించాలని అన్నారు. బ్లాక్ స్పాట్లుగా గుర్తించబడిన ప్రదేశాలలో తక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఎక్కడ ప్రమాదం జరిగినా, అందుకు గల కారణాలపై పూర్తిస్థాయిలో పరిశీలన జరపాలని, తద్వారా అలాంటి చోట్ల మరోమారు ప్రమాదాలు జరుగకుండా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. అధికారులు అంకితభావంతో కృషి చేస్తూ నిజామాబాద్ ను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీఈఓ అశోక్, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల, డీటీఓ ఉమా మహేశ్వరరావు, డీఈఓ అశోక్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, హర్ష తదితరులు పాల్గొన్నారు.

























