నిజామాబాద్, ఫిబ్రవరి 28 : ప్రస్తుత సీజన్ లో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించే వరి ధాన్యాన్ని నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్ లను గుర్తించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని స్టేట్ ఛాంబర్ లో శనివారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి అధికారులతో సుదీర్ఘ నిర్వహించారు. ఒక్కో శాఖ వారిగా అభివృద్ధి పనుల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యం ఎంత, లేవీ రూపంలో వారు ఎఫ్ సీ ఐ కి ఎంత పరిమాణంలో బియ్యం నిల్వలు అందించారు, ఇంకా ఎంత లేవీ రావాల్సి ఉంది, ఎన్ని గోడౌన్ లు అందుబాటులో ఉన్నాయి తదితర వివరాల గురించి సివిల్ సప్లై అధికారులను ఆరా తీశారు. ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ధాన్యం నిల్వ కోసం సరిపడా గిడ్డంగులను అందుబాటులో ఉండేలా ఇప్పటినుండే స్పష్టమైన ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని అన్నారు. లేవీ అందించడంలో విఫలమైన 57మంది డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుండి రూ. 276 కోట్లు రికవరీ చేసేందుకు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో అవసరమైన అన్ని గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా మెరుగుపరిచే పనులు వేగంగా జరిపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన భవిత కేంద్రాల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిరోధించాలని, క్షేత్రస్థాయిలో గట్టి నిఘా ఉంచాలన్నారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.























