నిజామాబాద్, ఫిబ్రవరి 24 : రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ మంగళవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయిచైతన్యలతో భేటీ అయ్యారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్దేశించిన కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేలా చొరవ చూపాలని, మైనార్టీల భద్రతకు, బాధితులకు న్యాయం కల్పించేందుకు కృషి చేయాలని చైర్మన్ ఈ సందర్భంగా సూచించారు. మైనార్టీ విద్యాలయాలలో పూర్తి స్థాయిలో అడ్మిషన్లు జరిగేలా చూడాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. చైర్మన్ వెంట జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి ఉన్నారు.























