నిజామాబాద్ బస్టాండ్లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందినట్లు సమాచారం.
ఆగస్టు 25న జరిగిన ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్టాండ్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రమాదానికి అసలు కారణాలను వెలుగులోకి తేవాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.
ప్రమాదంలో మృతిచెందిన మహిళకు సంబంధించిన వారు అక్కడ లేకపోవడంతో ఘటనకు సంబంధించిన వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, మహిళ ఫిట్స్తో మృతి చెందినట్లు ప్రచారం జరుగుతుండటంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రయాణికుల కథనం ప్రకారం, మహిళ నుదుటి కుడివైపు గాయమైందని, ముక్కు, చెవి నుంచి రక్తస్రావం జరిగినట్లు చెబుతున్నారు. బస్సు ఢీకొనడం వల్లే ఈ గాయాలు అయ్యాయా? లేక మరేదైనా కారణమా? అనే విషయాన్ని సీసీ కెమెరా ఫుటేజీ, వైద్య నివేదికలు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.
బస్టాండ్ పరిధిలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమైతే, విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏది ఏమైనా, వృద్ధ మహిళ మృతికి అసలు కారణం ఏమిటో నిగ్గుతేల్చేందుకు అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని, బస్టాండ్లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి నిజానిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

























