వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్..
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ చలిమెల శ్రీనివాస్ సూచించారు. గ్రామంలోని పలు వీధులు, కాలనీల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలను ఒంటరిగా బయటకు పంపకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. కుక్కలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకుండా, వాటికి దూరంగా ఉండాలని గ్రామ ప్రజలకు సూచించారు.
కుక్కల బెడదను అరికట్టేందుకు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేలా కృషి చేస్తామని సర్పంచ్ చలిమెల శ్రీనివాస్ తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వీధి కుక్కల నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా ఎవరైనా కుక్కకాటుకు గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకోవాలని కోరారు. ప్రజల భద్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, గ్రామంలో కుక్కల బెడదను పూర్తిగా నివారించేందుకు చర్యలు చేపడతామని సర్పంచ్ చలిమెల శ్రీనివాస్ తెలిపారు

























