51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి.. ఆరు డీఏలను ప్రకటించాలి
EHSను పకడ్బందీగా అమలు చేయాలి: డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. దాసు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్గల్: ప్రభుత్వం పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని ఉద్యోగ, ఉపాధ్యాయులకు 51 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. దాసు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే ప్రకటించాలని, EHS అమలుపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించి పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.
డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం. బాలయ్య మాట్లాడుతూ.. డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ, డైట్ లెక్చరర్లు, సీనియర్ లెక్చరర్లు, ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని కోరారు. కామన్ సర్వీస్ రూల్స్ను పరిష్కరించడంతో పాటు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేజీబీవీల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్, ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయులతో సమానంగా అన్ని రకాల సెలవుల సౌకర్యం కల్పించాలని కోరారు. పని విధానాల్లో స్పష్టమైన వర్క్ డివిజన్, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో కింద వేతనాలు చెల్లించాలని, కారుణ్య నియామకాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతరం భీమ్గల్ మండలంలోని జాగిర్యల్, కుప్కల్, బెజ్జోరా, ముచ్కూర్, పిప్రి, బాచన్పల్లి, కేజీబీవీ తదితర పాఠశాలలను సందర్శించి డీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. దాసు, జిల్లా అధ్యక్షుడు ఎం. బాలయ్య, కార్యదర్శి షేక్ మదర్, భీమ్గల్ మండల ప్రధాన కార్యదర్శి గట్టు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

























