స్నేహపూర్వక సమ్మేళనమే ‘ప్రసాద్ పార్టీ’
వైశ్య సంఘం గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ…
ఇందూరు: వైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపాల వద్ద నిర్వహించే ‘ప్రసాద్ పార్టీ’ స్నేహపూర్వక సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.
నగరంలోని గంజ్ ప్రాంతంలో ఉన్న పట్టణ వైశ్య సంఘంలో నిర్వహించిన ‘ప్రసాద్ పార్టీ’ కార్యక్రమానికి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడంలో వైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు.
వైశ్యులంతా ఐక్యతతో ఏకతాటిపై నడిచి సమాజ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను గత 55 సంవత్సరాలుగా ప్రసాద్ పార్టీ కార్యక్రమానికి హాజరవుతున్నానని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.
యువజన సంఘం కమిటీ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. పట్టణ వైశ్య సంఘంలో గత 82 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైశ్య సేవా సంఘం గణేష్ మండలి అధ్యక్షుడు శివకుమార్ గుప్తా, పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, మోటూరి మురళి గుప్తా, అర్వపల్లి పురుషోత్తం గుప్తా, శ్రీనివాస్ గుప్తాతో పాటు ఆయా అనుబంధ సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

























