దాదాపు దశాబ్దం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు
అక్టోబర్ 9న గుర్తింపు సంఘం ఎన్నికలు.. స్వచ్ఛందంగా పాల్గొనాలని కార్మికులకు పిలుపు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
దాదాపు దశాబ్దం తర్వాత తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 9న గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల అనంతరం ఆర్టీసీ విలీనానికి సంబంధించి తదుపరి ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే కార్మిక సంఘాల ప్రతినిధులను అధికారుల కమిటీలో భాగస్వామ్యం చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
కార్మికుల సమస్యల పరిష్కారంలో భాగంగా డీఏలు, ఫిట్మెంట్, సీసీఎస్–పీఎఫ్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
ఇప్పటికే 1,432 కారుణ్య నియామకాలు పూర్తి చేసినట్లు, 2,932 కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా 4,000 ఉద్యోగాల నియామకాలకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు దాదాపు పదేళ్ల తర్వాత జరుగుతుండటంతో ఈ ఎన్నికలపై కార్మికుల్లో ఆసక్తి నెలకొంది.

























