సైబర్ నేరగాళ్లపై ‘ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0’ నిఘా : డైరెక్టర్ శిఖా గోయల్
హైదరాబాద్: ఏప్రిల్ 26:రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసిఎస్బి) సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. గడిచిన రెండేళ్లలో అరెస్టయిన నేరగాళ్లు మళ్లీ నేరాల బాట పట్టకుండా ఉండేలా ‘ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0’ పేరిట భారీ నిఘా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు. ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రత్యేక తనిఖీలు ప్రారంభమయ్యాయని, శాంతిభద్రతల విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
ఈ ఆపరేషన్ గురించి శిఖా గోయల్ వివరాలు తెలుపుతూ, సైబర్ నేరాల పట్ల తమది ‘జీరో టాలరెన్స్’ విధానమని స్పష్టం చేశారు. 2024-25 కాలంలో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3,567 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేయగా, వారిలో రాష్ట్రానికి చెందిన 614 మంది ప్రధాన నిందితులపై ప్రస్తుతం ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ఈ తనిఖీల కోసం 300 బృందాలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాయని, నిందితుల ప్రస్తుత నివాసం, వృత్తి, వారి ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నాయని వివరించారు. ప్రతి నిందితుడి నివాసాన్ని జియో ట్యాగింగ్ చేయడం ద్వారా వారి కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తున్నామని, వారు బెయిల్ నిబంధనలను అతిక్రమించకుండా చూస్తున్నామని ఆమె పేర్కొన్నారు.అరెస్టయిన వారిలో మ్యూల్ అకౌంట్ హోల్డర్లు (269), ఏజెంట్లు (155), చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ (సి ఎస్ ఏ ఎం ) నిందితులు (36), సైబర్ స్లేవరీకి పాల్పడేవారు (8) వంటి వివిధ రకాల నేరగాళ్లు ఉన్నట్లు డైరెక్టర్ వెల్లడించారు. ఇప్పటివరకు 335 మందిని భౌతికంగా తనిఖీ చేయగా, వీరికి తెలంగాణలో 480 కేసులు, దేశవ్యాప్తంగా 1,233 కేసులతో సంబంధం ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరిలో 218 మంది ఆచూకీ లభించగా, 115 మంది పరారీలో ఉన్నారని, ముగ్గురు మరణించారని తెలిపారు. ఈ క్రమంలోనే సీఎస్ఈఏఎం కేసులో నిందితుడైన ప్రసాద్ కుమార్ అనే వ్యక్తి ప్రస్తుతం నేపాల్లో ఉన్నట్లు గుర్తించామని, గతంలో అతడు సికింద్రాబాద్లోని ఒక రెస్టారెంట్లో పని చేసేవాడని ఆమె వివరించారు.
ఒకసారి అరెస్టయిన తర్వాత కూడా నిందితులు పోలీసుల నిఘాలోనే ఉంటారని ‘ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0’ ద్వారా తెలియజేస్తున్నామని శిఖా గోయల్ పునరుద్ఘాటించారు. ఎవరైనా మళ్లీ నేరాలకు పాల్పడినట్లు తెలిస్తే లేదా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వారిపై వెంటనే ‘సస్పెక్ట్ షీట్లు’ తెరిచి, కఠిన నిఘా ఉంచుతామని హెచ్చరించారు. పౌరులను సైబర్ మోసాల నుండి రక్షించేందుకు తెలంగాణ పోలీసులు అన్ని దశల్లోనూ అప్రమత్తంగా ఉన్నారని డైరెక్టర్ శిఖ గోయల్ భరోసా ఇచ్చారు.

























