మొరం అక్రమ తవ్వకాలపై చీత ఫోర్స్ మెరుపు దాడి : పోలీస్ కమీషనర్ వెల్లడి
2 జె సి బి యంత్రాలు , 13 ట్రాక్టర్లు స్వాధీనం…
సోమవారం నాడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు , జిల్లాలో జరుగుతున్న అక్రమ మొరం తవ్వకాలు మరియు అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా CCS ఏసీపీ ఇన్చార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీత ఫోర్స్ సిబ్బంది ఈ రోజు ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలారం గ్రామంలోని పెద్ద వాగు ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు, అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తవ్వకాలు నిర్వహిస్తూ రవాణా చేస్తున్న వాహనాలను గుర్తించారు. వెంటనే మెరుపు దాడి నిర్వహించి, తవ్వకాలకు ఉపయోగిస్తున్న 2 జేసీబీ యంత్రాలు మరియు మొరం రవాణాకు వినియోగిస్తున్న 13 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడమే కాకుండా, సహజ వనరులు దెబ్బతింటాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా వాగులు, చెరువులు మరియు పరిసర ప్రాంతాల పర్యావరణ సమతుల్యతకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
స్వాధీనం చేసుకున్న వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం ధర్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ కి అప్పగించారు. సంబంధిత వ్యక్తులపై మైనింగ్ మరియు ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన వంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా ఇలాంటి విషయాలపై సమాచారం అందించాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.

























