500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
హైదరాబాద్, జూన్05: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు 500 మంది పోలీసులు.. బృందాలుగా ఏర్పడి 113 స్పా సెంటర్లపై ముకుమ్మడిగా తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా పలు స్పా సెంటర్లలో అక్రమాలతోపాటు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కస్టమర్లకు సంబంధించిన డేటా రిజిస్టర్ను సైతం స్పా సెంటర్ నిర్వాహకులు మెయింటెయిన్ చేయడం లేదని గుర్తించారు. అలాగే స్పా సెంటర్లకు రెంటుకు ఇస్తున్న ఓనర్లను కూడా ఈ సందర్భంగా పోలీసులు విచారించారు.
స్పా సెంటర్ల నుంచి రెంట్ తీసుకోవడం తప్ప.. అందులో ఏం జరుగుతుందో కూడా ఓనర్లు పట్టించుకోవడం లేదని పోలీసుల విచారణలో బహిర్గతమైంది. కొన్ని స్పా సెంటర్లలో అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించి కూడా.. ఇంటి ఓనర్లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని పోలీసులు గుర్తించారు. నగరంలోని స్పా సెంటర్ల భారీగా ఉన్నాయి. వీటిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ అడపాదడపా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఆయా ఫిర్యాదుల మేరకు పోలీసులు దాడులు చేస్తున్నారు.
ఈ సందర్భంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ నగరంలో ఒకే సారి భారీగా స్పా సెంటర్లపై పోలీసులు ఏకకాలంలో దాడులు చేయడం ఇదే ప్రధమం అనే చర్చ నడుస్తుంది. అలాగే స్పా సెంటర్ల నిర్వహణ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని.. పోలీస్ ఉన్నతాధికారులను ప్రజలు కోరుతున్నారు. స్పా ముసుగులో అసాంఘిక చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా.. వీటికి అడ్డుకట్ట వేయవచ్చని పోలీసులకు ప్రజలు విజ్ఞప్తి చేశారు…

























