భీమ్గల్ క్యారమ్ క్రీడాకారుల ఘనత దశాబ్దాల కీర్తికి ఆత్మీయ సంబరం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్గల్ జూలై 4, ప్రపంచ క్యారమ్ క్రీడా వేదికపై భీమ్గల్ ప్రాంతానికి చెందిన ప్రముఖ క్రీడాకారుడు దయాల రవీందర్ గౌడ్ రన్నరప్గా నిలిచి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చారిత్రక ఘట్టానికి శనివారం నాటికి 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భీమ్గల్ క్యారమ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ తహేర్ ఆధ్వర్యంలో స్థానికంగా ఆత్మీయ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో కేక్ కట్ చేసి రవీందర్ గౌడ్ సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఆనాటి మధుర జ్ఞాపకాలను క్రీడాకారులు నెమరువేసుకున్నారు. భీమ్గల్ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారుల సేవలను కొనియాడుతూ వారిని అభినందించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ నీలం రవి మాట్లాడుతూ, భీమ్గల్ వంటి చిన్న ప్రాంతం నుంచి ఇప్పటివరకు తొమ్మిది మంది క్రీడాకారులు జాతీయ స్థాయి క్యారమ్ పోటీల్లో పాల్గొనడం గర్వకారణమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రన్నరప్గా నిలిచిన దయాళ రవీందర్ గౌడ్ విజయంతో భీమ్గల్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఈ విజయాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని, యువ క్రీడాకారులు మరింతగా క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో క్యారమ్ అసోసియేషన్ సభ్యులు సతీష్ ఎంపీడీఓ తుఫ్రాన్, రాజేందర్, వెంకటనర్సయ్య, శివానంద్ రెడ్డి, శ్యామ్, రహీం హునాని, సురేందర్, మోహన్, ఇక్రామ్, ఇబ్రహీం, లక్ష్మణ్తో పాటు పలువురు క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొని దయాల రవీందర్ గౌడ్ విజయాన్ని స్మరించుకుంటూ అభినందనలు తెలిపారు.

























