నవ భారత నిర్మాత ప్రధాని నరేంద్ర మోదీ: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
ఇందూరు: నవభారత నిర్మాత, దేశ ప్రగతి దార్శనికులు ప్రధాని నరేంద్ర మోదీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా స్పష్టం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని నగరంలోని గంగస్థాన్లో గల స్నేహ సొసైటీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… 13 సంవత్సరాలు సీఎంగా, 12 ఏళ్లు ప్రధానిగా సేవలందిస్తూ దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారన్నారు. ప్రపంచంలోనే దేశాన్ని విశ్వ గురువుగా నిలబెడుతున్నారని కొనియాడారు. అన్నివర్గాల ప్రజలకు సమ న్యాయం చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ ” ఆశీర్వాద దీపం” కూడా వెలిగించారన్నారు. ప్రజాసేవ కోసం ఆయన జీవితం అంకితం చేశారని తెలిపారు. సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉందని, ప్రధాని మోడీ పుట్టిన రోజుతో పాటు తెలంగాణ విమోచన దినం, విశ్వ కర్మ జయంతి కూడా ఉందని గుర్తుచేశారు. నిజాం రాచరిక పాలన నుంచి విముక్తి పొందిన రోజన్నారు. ప్రధాని పుట్టిన రోజును పురస్కరించుకొని స్నేహ సొసైటీ లోని విద్యార్థులతో కలిసి వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, నాయకులు మారావార్ కృష్ణ, బాబీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.























