మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి
అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ..
ఇందూరు: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త తెలిపారు. నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మాజీ సైనికులకు అందాల్సిన సంక్షేమ పథకాల్లో జాప్యం జరుగుతుందన్నారు. ప్రధానంగా ఆస్తి పన్ను, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్, ఇళ్ల స్థలం, వ్యవసాయ భూములు తదితర పథకాలు తొందరగా అమలు కావడం లేదని తన దృష్టికి తీసుకొచ్చారు అన్నారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఆస్తిపన్ను విషయంలో మున్సిపల్ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
తమతో సమావేశం నిర్వహించిన మొదటి ఎమ్మెల్యే…
మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన మొదటి ఎమ్మెల్యే… ధన్ పాల్ సూర్యనారాయణ అని సంఘం జిల్లా అధ్యక్షుడు సూర హర ప్రసాద్ తెలిపారు. తమ సమస్యలను ప్రత్యేకంగా విన్నారన్నారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి దివాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మధుసూదన్, సహాయ కార్యదర్శి రూపేష్ కుమార్, సలహాదారులు మోహన్, కోశాధికారి థామస్ తదితరులు పాల్గొన్నారు.

























