హిందూ ధర్మాన్ని మరువొద్దు
– భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలి
– పిల్లలకు ధర్మాన్ని, సంస్కారాన్ని నేర్పాలి
– వక్తలు పిట్ల కృష్ణ మహరాజ్, ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్
– గొట్టుముక్కలలో విజయవంతమైన హిందూ సమ్మేళనం
మాక్లూర్ : ప్రజలంతా హిందూ ధర్మాన్ని మరువొద్దని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని మల్లారం లింగేశ్వర గుట్ట వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహరాజ్, ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ పిలుపునిచ్చారు. రాష్ర్టీయ స్వయం సేవక్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మాక్లూర్ మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వక్తలు మాట్లాడుతూ మన దేశం వసుదైవ కుటుంబమని, అంతా రాముని బాటలో నడవాలన్నారు. భారతదేశంలో ఉన్నవారంతా హిందువులేనని, హిందుత్వం మన జీవన విధానమని పేర్కొన్నారు. పిల్లలకు నిస్వార్థం, దానగుణం, దయ నేర్పాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. పిల్లలు దారి తప్పకుండా సరైన మార్గంలో నడిచేలా చూడాలన్నారు. లవ్ జీహాద్ వంటి వాటి వైపు మరలకుండా జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, దుర్గాదేవి, ఛత్రపతి శివాజీ మహరాజ్ తదితరులు చూపిన మార్గంలో నడవాలన్నారు. సెల్ ఫోన్, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. తల్లిదండ్రులను ప్రేమించాలని, అత్తామామలను గౌరవించాలన్నారు. హిందూ ధర్మం కోసం పనిచేసే నాయకులను ఎన్నుకోవాలన్నారు. కులాల పేరిట దూరం కాకుండా, మనమంతా ఒక్కటేనని భావన కలిగి ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు. కొందరు పాశ్చ్యాత్య పోకడలకు వెళ్లి దాంపత్య జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని, అలా కాకుండా వివాహ బంధంలో సీతారాముల మార్గంలో నడిచేలా తీర్చిదిద్దాలని సూచించారు. పిల్లలను ఆధ్యాత్మికతవైపు అడుగులు వేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు జడ్పీహెచ్ఎస్ గొట్టుముక్కల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం హిందూ సమ్మేళన కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన వారికి నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ గ్రామ వికాస్ జిల్లా ప్రముఖ్ ధాత్రిక పాండు రంగారావు, హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు బచ్చు రమేశ్, ప్రధాన కార్యదర్శి యాట గంగాధర్, చుట్టు పక్కల గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

























