నిజామాబాద్ ఫిబ్రవరి 23 : వచ్చే ఏడాది 2027 జూలై 23 నుండి ఆగస్టు 03వ తేదీ వరకు జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఇలా త్రిపాఠితో, ఇతర జిల్లా అధికారులతో పుష్కర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్ బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోఛంపాడ్,. సావెల్, తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ వద్ద పుష్కర ఘాట్లు ఉంటాయని, వీటితో పాటు అనువైన ఇతర గోదావరి పరీవాహక ప్రదేశాలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించవచ్చని అన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గోదావరి నది తీరంలో సౌకర్యాల కల్పన దిశగా పుష్కర ఘాట్ల వద్ద చేపట్టాల్సిన పనులను గుర్తించాలన్నారు.
వీ.సీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి తన ఛాంబర్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. గత పుష్కరాలలో గోదావరి నదిలో పుష్కర స్నానం చేసిన భక్తుల సంఖ్య, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్, భద్రత, రూట్ మ్యాప్ ఇతర ఏర్పాట్ల వివరాలను పరిశీలించి, ఆయా శాఖల వారీగా సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున అన్ని అంశాలను నిశితంగా పరిశీలన జరపాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్టీసీ ఆర్.ఎం జ్యోత్స్న, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

























