నిజామాబాద్, ఫిబ్రవరి 28 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శనివారం ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు. అంతకుముందు మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్), క్రిటికల్ కేర్ యూనిట్ లతో కూడిన భవన సముదాయాన్ని పరిశీలించారు. సుదీర్ఘ కాలం నుంచి పలు పనులు పెండింగ్ లోనే ఉండడం గమనించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జీ.జీ.హెచ్ లో కొనసాగుతున్న ప్రసూతి సేవల విభాగాన్ని వెంటనే ఎం.సీ.హెచ్ లోకి మార్చాలని ఆదేశించారు.
అనంతరం జీజీహెచ్ లో ఆసుపత్రి పనితీరుపై సంబంధిత వైద్యులతో ప్రభుత్వ సలహాదారు, కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష జరిపారు. ఒక్కో విభాగం వారీగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలు, ఇంకనూ సమకూర్చాల్సి ఉన్న సదుపాయాలు తదితర వాటి గురించి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి వైద్య విభాగాల అధిపతులను అడిగి తెలుసుకున్నారు.
వైద్య సేవలను మరింతగా మెరుగుపర్చాలని, అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తామని సూచించారు. వివిధ వైద్య సేవల కోసం ప్రతిరోజు 2000 మంది వరకు అవుట్ పేషంట్ రోగులు జీజీహెచ్ కు వస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని విభాగాల పనితీరు మెరుగుపడేలా చూడాలన్నారు. అన్ని విభాగాలలో 180 మంది వైద్యులు, సరిపడా సిబ్బందితో పాటు అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు జీజీహెచ్ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మేజర్, మైనర్ సర్జరీలతో పాటు షుగర్, బీపీ, డెంగ్యూ, మలేరియా, థైరాయిడ్ వంటి వ్యాధి నిర్ధారణ టెస్టులు ఉచితంగా చేస్తారని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వీటికి వేల రూపాయల రుసుము వసూలు చేస్తారని అన్నారు. అన్ని విభాగాలలో ప్రైవేట్ తో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిపుణులైన వైద్యులు, వారికి అనుబంధంగా వైద్య విద్యను అభ్యసిస్తున్న మెడికోలు ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జీజీహెచ్ లో కీలు మార్పిడి శాస్త్ర చికిత్సలు నిర్వహిస్తుండడం జరుగుతోందని, డెంటల్ విభాగం ఆధ్వర్యంలో ఎంతో ఖర్చుతో కూడుకుని ఉన్న సర్జరీలను కూడా స్థానికంగా చేస్తున్నారని అన్నారు. విద్యా, వైద్య రంగాల పని తీరును మరింతగా మెరుగుపర్చాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు
ఈ మేరకు ఆసు ఆధునాతన వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయిస్తున్నామని గుర్తు చేశారు. కొంతమంది సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రత్యేకించి బయో మెట్రిక్ హాజరు వేసుకుని వెళ్ళిపోతున్న సిబ్బందిపై గట్టి నిఘా ఉంచాలన్నారు. సమీక్షలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రాములు, వివిధ విభాగాల వైద్యాధికారులు పాల్గొన్నారు.























