నిజామాబాద్, మార్చి 06 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలులో నిజామాబాద్, కామారెడ్డిలతో కూడిన ఉమ్మడి జిల్లాను ముందంజలో నిలపాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసురి అనసూయ సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలుపై నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉమ్మడి జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేయగా, ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సంగ్వాన్ లు ప్రగతి ప్రణాళిక అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక గురించి ఆయా శాఖలు, అంశాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా ఇంచార్జి మంత్రి దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క మాట్లాడుతూ,
పల్లెలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఆయా శాఖల వారీగా పరిసరాల పరిశుభ్రత. ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అరైవ్.. అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత.. డ్రగ్స్ కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం.. వ్యవసాయం, విద్య, యువత.. క్రీడలు, మహిళలు, పర్యావరణం అంశాలలో నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా విజయవంతం అయ్యేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉద్యోగులు ప్రగతి ప్రణాళిక అమలులో క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేస్తూ, ప్రజలకు జవాబుదారీగా పారదర్శకతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ ప్రణాళిక అమలు ద్వారా రానున్న మూడు నెలల వ్యవధిలో ప్రజారోగ్యం, విద్య, వైద్యం, అంగన్వాడీల నిర్వహణ, స్త్రీ శిశు సంక్షేమం, పారిశుధ్యం తదితర అంశాలలో స్పష్టమైన మార్పు కనిపించేలా అంకిత భావంతో పని చేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాలలో బాల్య వివాహాలు వంటి సామాజిక రుగ్మతలను దూరం చేసేందుకు, డ్రగ్స్, కల్తీకల్లు, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాల గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, వాటి నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఇంచార్జి మంత్రి ఆదేశించారు. అంగన్వాడి, గ్రామ పంచాయతీ, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయించాలని,
తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలపై గ్రామ సభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆదర్శ పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకెళ్లడమే లక్ష్యంగా, అధికారులు సమన్వయంతో పని చేసి ఈ ‘ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చేయాలని మంత్రి ధనసురి అనసూయ అధికారులను కార్యోన్ముఖులను చేశారు. ఈ కార్యక్రమం పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ను వినియోగించాలని ఉమ్మడి జిల్లా అధికారులకు సూచించారు.
ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ప్రగతి ప్రణాళిక అమలులో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో కూడిన అంశాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంపొందించాలని సూచించారు. అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేయిస్తూ, రోడ్ల మరమ్మతులు, రెవెన్యూ సంబంధిత అంశాల అనుమతుల జారీ వంటి వాటిపై దృష్టిని కేంద్రీకరించాలని అధికారులను కోరారు. వేసవిలో ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగానే ప్రణాలికాబద్దంగా వ్యవహరించాలని సూచించారు. కేంద్రం ద్వారా సమకూరే నిధులతో చేపట్టాల్సి ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయించేలా చొరవ చూపాలని, తద్వారా నిధులు మురిగిపోకుండా, వెనక్కి మల్లిపోకుండా పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ నగర మేయర్ కే.ఉమారాణి, నుడా చైర్మన్ కేశ వేణు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నిజామాబాద్ పొలీస్ కమిషనర్ సాయిచైతన్య, కామారెడ్డి ఎస్.పీ రాజేష్ చంద్ర, నిజామాబాద్ అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఎఫ్ఓ లు వికాస్ మీనా, నిఖిత, ఏసీపీ చైతన్య రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన అన్ని శాఖల అధికారులు, మున్సిపల్ చైర్ పర్సన్ లు, తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముగ్గురు దివ్యాంగులకు మంత్రి సీతక్క చేతుల మీదుగా ల్యాప్ టాప్ లు అందజేశారు.
*మినీ సరస్ ఫెయిర్ – 2026 ను ప్రారంభించిన మంత్రి సీతక్క*
జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, సెర్ప్, నాబార్డు ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినీ సరస్ ఫెయిర్ – 2026 ను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠిలతో కలిసి జిల్లా ఇంచార్జి మంత్రి ధనసురి అనసూయ సీతక్క లాంచనంగా ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శన, విక్రయ స్టాళ్లను తిలకించారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.
మహిళా ప్రగతి-తెలంగాణ ఉన్నతి అనే నినాదానికి కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల ఆర్ధిక అభ్యున్నతికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే వడ్డీ లేని రుణాల పంపిణీ, ఉచిత ప్రమాద బీమా, లోన్ బీమా, ఆర్టీసీలో ఆద్దె బస్సులు, పెట్రోల్ బ్యాంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. వచ్చే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం తమ ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టనుందని మంత్రి వెల్లడించారు. మహిళలు ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ ఆర్ధిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి, డీ.ఆర్.డీ.ఓ సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వినాయక నగర్ లోని విజయలక్ష్మి గార్డెన్స్ లో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సాధికారత కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.
నిజామాబాద్ పర్యటనకు విచ్చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి ధనసూరి అనసూయ సీతక్కకు ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇతర జిల్లా అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.

























