రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డిజిపి శ్రీ సివి ఆనంద్ విస్తృత తనిఖీలు
హైదరాబాద్, మే 25 : రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ సోమవారం నాడు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని అన్ని విభాగాలను ఆయన స్వయంగా పరిశీలించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ తనిఖీల్లో డిజిపి అధికారులకు, సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
కార్యాలయంలోని అన్ని విభాగాలు అత్యంత పరిశుభ్రంగా ఉండాలని, విధి నిర్వహణలో మరింత సమర్థతను చాటాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఆఫీస్ రూపురేఖలు మార్చేలా గోడలు, అల్మారాలు, టేబుళ్లకు ఒకే విధమైన (స్టాండర్డైజ్డ్) రంగులు వేయించాలని సూచించారు. కార్యాలయంలో ఎక్కడపడితే అక్కడ ఫైళ్లను ఉంచకుండా, తక్షణమే వాటిని రికార్డు రూమ్కు తరలించాలని స్పష్టం చేశారు. అలాగే కాన్ఫరెన్స్ హాల్, ట్రైనింగ్ హాల్ సహా ఇతర గదులను మరింత విశాలంగా మార్చేందుకు వీలుగా రీ-డిజైనింగ్ (పునర్నిర్మాణం) చేయాలని అధికారులతో చర్చించారు.
ఈ తనిఖీల్లో డిజిపి సివి ఆనంద్ వెంట పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ ఎమ్. భగవత్, డీజీ (ఆర్గనైజేషన్ & హోంగార్డ్స్) స్వాతి లక్రా, డీజీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి. శ్రీనివాసరావు, డీజీ (సీఐడీ) చారు సిన్హా, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, గజరావు భూపాల్ తదితరులు తమ తమ విభాగాల పనితీరు, ప్రస్తుతం కొనసాగుతున్న కార్యకలాపాలను డీజీపీ సీవీ ఆనంద్కు వివరించారు.

























