వాటర్ బిల్లు పేరుతో సైబర్ మోసాలు: సీపీ సజ్జనార్ హెచ్చరిక
ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను ఎంచుకొని ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నగరవాసులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వాటర్ బిల్లుల పేరుతో కొత్త తరహా మోసాలకు తెరలేపారు. “మీ నీటి బిల్లు బకాయి ఉంది. వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తాం” అంటూ వాటర్ బోర్డు (HMWSSB) అధికారుల పేరుతో ఫోన్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు బిల్లు అప్డేట్ పేరుతో HMWSSB WATER BILL UPDATE.apk పంపి, దానిని ఇన్స్టాల్ చేయాలని నమ్మిస్తున్నారు. ఒక్కసారి ఆ ఏపీకే ఫైల్ను ఫోన్లో డౌన్లోడ్ చేస్తే, మీ మొబైల్ నియంత్రణ మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని, వారు మీ కాల్స్ను డైవర్ట్ చేయడమే కాకుండా బ్యాంక్ ఓటీపీలను తస్కరించి క్షణాల్లో ఖాతాలను ఖాళీ చేస్తున్నారని ఎక్స్ వేదికగా సీపీ సజ్జనార్ అలర్ట్ జారీ చేశారు.























