టెహ్రాన్ రెవల్యూషన్ స్క్వేర్ వద్ద భారీ క్షిపణులను ప్రదర్శించిన ఇరాన్
ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 23: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, ఇరాన్ తన సైనిక బలాన్ని చాటుతూ టెహ్రాన్లోని రెవల్యూషన్ స్క్వేర్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ప్రదర్శనలో సుమారు 2,000 కిలోమీటర్ల పరిధి కలిగిన లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను ప్రదర్శించారు.
ప్రదర్శనలో ప్రధానంగా ‘ఖదర్’ అనే అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణిని భారీ జనసమూహం మధ్య రోడ్డుపై ర్యాలీగా తీసుకెళ్లారు. ఇది పాత ‘షహాబ్-3A’ క్షిపణికి లేటెస్ట్ వెర్షన్. ఈ భారీ క్షిపణి ద్రవ, ఘన ఇంధన చోదక వ్యవస్థలను కలిగి, క్లస్టర్ బాంబులను ప్రయోగించగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ సందర్భంగా పెద్దఎత్తున ఇరానియన్లు దేశ జాతీయ పతాకాలు చేతబట్టి రోడ్ల మీద హర్షధ్వానాలు చేశారు.
ఇదిలాఉండగా, ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం పూర్తిగా నిర్వీర్యమయ్యాయని అమెరికా గతంలో పేర్కొన్నప్పటికీ, తాజా నివేదికలు భిన్నంగా ఉన్నాయి. ఇరాన్ వద్ద ఇంకా వేల సంఖ్యలో క్షిపణులు, ‘కామికాజ్’ డ్రోన్లు క్షేమంగా ఉన్నాయని అమెరికా నిఘా సంస్థ అంచనా వేసింది.
అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఐదు వారాలకు పైగా దాడులు జరిపినప్పటికీ, ఇరాన్ తన క్షిపణి లాంచర్లలో సగానికి పైగా సురక్షితంగా ఉంచుకోగలిగిందని సీఎన్ఎన్ (CNN) పరిశోధనలో తేలింది. క్లుప్తంగా చెప్పాలంటే, కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ, తన ఆయుధ సంపత్తి ఏమాత్రం తగ్గలేదని ఇరాన్ ఈ ర్యాలీ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పింది..
























