ప్రజల కోసమే ప్రధాని మోదీ జీవితం
అన్ని రంగాల్లో దేశం ముందుకు..
ఆశీర్వాద దీపం కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్…
ఇందూరు: ప్రజల కోసమే ప్రధాని నరేంద్ర మోదీ తన జీవితాన్ని అంకితం చేశారని, నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని రైల్వే స్టేషన్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. మోదీ సుదీర్ఘకాలం గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా సేవలందిస్తూ దేశ ఔన్నత్యాన్ని చాటుతున్నారని అన్నారు. ప్రపంచంలో భారత్ను విశ్వగురువుగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధితో పోలిస్తే, మోదీ పాలనలో దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే అన్నారు. అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు సమన్యాయం చేస్తూ దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆశీర్వాద దీపాన్ని వెలిగించి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, మఠం పవన్, శ్రావణ్ కుమార్, బంటు ప్రీతి, జ్యోతి, ఎర్రం సుధీర్, మల్కాయి మహేందర్, బట్టు రాఘవేందర్, పంచరెడ్డి అనిత, మహిళా మోర్చా అధ్యక్షురాలు వనిత, నాయకులు మల్లేష్ యాదవ్, బంటు ప్రవీణ్, ఇప్పకాయల కిషోర్, మురళి, మండల అధ్యక్షులు గడ్డం రాజు, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.

























