నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఇసుక సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, మే 11 : ఇసుక రవాణా విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. కలెక్టర్ అధ్యక్షతన సోమవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి ఇసుక సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, మైనింగ్, ఇంజినీరింగ్ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇసుక రీచ్ లను. క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఇసుక కేటాయింపులు జరగాలని, ఇసుక రవాణా విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత.సంబంధిత శాఖల అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను తూచ తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇసుక వాహనాల రాకపోకలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పని చేస్తూ అక్రమాలకు తావు లేకుండా చూడాలన్నారు. ఇసుక రీచ్ ల వద్ద టీజీఎండిసి అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా పాటించాలని అన్నారు.
ఈ సందర్భంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, జవహర్ నవోదయ విద్యాలయం భవన సముదాయాల నిర్మాణాలకు అవసరమైన ఇసుక నిల్వలను నిర్దేశిత ఇసుక రీచ్ ల నుండి తరలించేందుకు కలెక్టర్ అనుమతించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మైనింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

























