నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి
నిజామాబాద్, మే 18 : ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జిల్లాలో ఇసుక రవాణాకు అనుమతులు జారీ చేయడం జరుగుతోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనల అతిక్రమణను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, ఇసుక అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా సంబంధిత శాఖల ద్వారా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు.
పర్యావరణ అనుమతులు లభించిన తరువాతే పోతంగల్ మండలం హంగర్గా గ్రామ శివారులోని మంజీరా నది నుండి ఇసుక రవాణాకు అనుమతించడం జరిగిందని తెలిపారు. టీజీఎండీసీ ద్వారా నిబంధనలను పక్కాగా పాటిస్తూ ఇసుక రవాణా కొనసాగుతోందని, తన ఆదేశాల మేరకు బోధన్ ఆర్.డీ.ఓ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి ఈ మేరకు నివేదిక అందించారని అన్నారు. వే బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోందని, ఉదయం 6.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకే ఇసుక వాహనాలకు అనుమతిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. టీజీఎండీసీ ద్వారా కొనసాగుతున్న కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించడం జరుగుతోందని, తూకంలో తేడా లేకుండా, ఓవర్ లోడ్ కు ఆస్కారం లేకుండా సీసీ కెమెరా ద్వారా నిఘా ఏర్పాటు చేశామని, జీ.పీ.ఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా ఇసుక లోడ్ తో కూడిన వాహనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తోంది అన్నది ఆన్లైన్ లో టీజీఎండీసీ ప్రధాన కార్యాలయంలో గమనించడం జరుగుతోందని అన్నారు. జిల్లాలోని మిగతా ఇసుక రీచ్ ల నుండి మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా ట్రాక్టర్లలో ఇసుక రవాణాకు అనుమతించడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు తావులేకుండా సంబంధిత శాఖల అధికారులను సమన్వయము చేసి విస్తృత తనిఖీలు జరిపిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇసుక రవాణా పారదర్శకంగా జరుగుతోందని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

























