ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా…
మరమ్మతులు, పరిశుభ్రత, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి
ఇందూరు: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆసుపత్రిలోని ప్రతి విభాగాధిపతి, వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా వైద్యుల హాజరు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఆసుపత్రిలో సివిల్ వర్క్స్కు సంబంధించిన పలు సమస్యలు ఉన్నాయని, మరమ్మతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ల్యాబ్, ఎక్స్రే తదితర పరీక్షల కోసం వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
కొంతమంది కింది స్థాయి సిబ్బంది రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రతి విభాగాధిపతి తమ సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
అధికారులు, వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వచ్చే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నాటికి పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఆసుపత్రి పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కులగాయల ఉమారాణి, డీఎంహెచ్వో డా. రాజశ్రీ, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాములు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

























