ఎన్టీఆర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్.. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు
32 వాహనాలు గుర్తింపు.. సైబర్ నేరాలు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు సూచనలు
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్, జూలై 19: నిజామాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో శనివారం ధర్పల్లి మండలంలోని ఎన్టీఆర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి, సిరికొండ, జక్రాన్పల్లి, డిచ్పల్లి పోలీస్ స్టేషన్లకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా పోలీసులు కాలనీలోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలతో మమేకమయ్యారు. వాహనాల తనిఖీల్లో సరైన పత్రాలు లేని 32 వాహనాలను గుర్తించి, సంబంధిత నిబంధనలను పాటించాలని వాహనదారులకు సూచించారు.
అలాగే సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు, సైబర్ నేరాల నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలి, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని తెలిపారు.

























