1000 రోజుల కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్ఎస్ సమరభేరి
హామీలు అమలు చేయాలని డిమాండ్.. గణేష్ బిగాల ఆధ్వర్యంలో వంటా-వార్పు, సదస్సులు…
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పార్టీ నిరసన గళం వినిపించింది. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో వంటా-వార్పు కార్యక్రమంతో పాటు సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, కళ్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం, మహిళలకు స్కూటీలు తదితర హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
1000 రోజుల కాంగ్రెస్ పాలన పూర్తయినా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, మహిళలకు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నాయకులు తెలిపారు. రానున్న రోజుల్లోనూ ప్రభుత్వ హామీల అమలు కోసం మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ NUDA చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్, సత్య ప్రకాష్, నవీద్ ఇక్బాల్, జగత్ రెడ్డి, ప్యాట సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

























