“హామీలు ఇచ్చి మోసం చేశారు.. గ్రామాల్లో కాంగ్రెస్ను నిలదీయండి: వేముల”
*ఆరు గ్యారంటీల పేరుతో మహిళలకు అనేక హామీలు ఇచ్చి మహిళలను నిండా ముంచిన రేవంత్ సర్కార్*
*కాంగ్రెస్ ఇచ్చిన ‘గ్యారెంటీ కార్డు మోసపూరితం*
*మోర్తాడ్ వేదికగా వీడియో ఆధారాలతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కల హామీలను బట్టబయలు చేసిన ఎమ్మెల్యే వేముల*
*2500 స్కీమ్ లో ప్రతి మహిళకు రూ. 82,500 కాంగ్రెస్ బాకీ*
*2000 నుండి 4000 కు పెంచే పెన్షన్ స్కీమ్ లో ప్రతి పింఛన్దారులకు రూ. 66,000 కాంగ్రెస్ బాకీ*
*బాల్కొండ నియోజకవర్గం లో 5000 మంది మహిళలకు తులం బంగారం’ కాంగ్రెస్ బాకీ ?*
*ఆడపిల్లలకు ‘ఎలక్ట్రిక్ స్కూటీలు’ ఏవీ?*
*కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను తక్షణమే పునరుద్ధరించాలి..*
*వేలాది మంది మహిళలు చేతులెత్తించి తీర్మానం*
*విద్యుత్, ఆర్టీసీ బస్సులలో రాయితీల పేరిట కాంగ్రెస్ సర్కార్ మోసం*
*ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయ పక్షపాతం వీడి, ప్రజల సమక్షంలో లక్కీ డ్రా తీయాలి*
*గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ బాకీ కార్డులతో నిలదీయండి*
*మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి*
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ :ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలను ప్రకటించి, అధికారంలోకి వచ్చాక మహిళలు, వృద్ధులు, విద్యార్థులను నిలువునా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను గ్రామగ్రామాన ప్రజలు నిలదీయాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మోర్తాడ్ మండల కేంద్రంలో నిర్వహించిన భారీ మహిళా సదస్సు మరియు వంటావార్పు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
నిరసనలో భాగంగా మహిళల తో వంటా వార్పు లో పాల్గొన్నారు మరియు మహిళలతో కలిసి ఎమ్మెల్యే వేముల బతుకమ్మ ఆడారు.ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఇచ్చిన వాగ్దానాల వీడియో క్లిప్పింగులను సభావేదికపై ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్పై ప్రదర్శించి, ప్రజల సాక్షిగా పాలకుల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.
గత కాంగ్రెస్, టీడీపీ పాలనలో పింఛన్ల మంజూరు తీరు అత్యంత దయనీయంగా ఉండేదని వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు. గ్రామంలో ఎవరో ఒకరు మరణిస్తే తప్ప మరొకరికి పింఛన్ రాని దుస్థితి ఉండేదని, ఊరికి కేవలం 50 నుంచి 100 మందికి మాత్రమే నామమాత్రంగా రూ. 200 పింఛన్ ఇచ్చేవారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి, పింఛను మొత్తాన్ని రూ. 1,000కి, ఆపై రూ. 2,000కి పెంచి గౌరవప్రదమైన జీవనాన్ని అందించారని తెలిపారు. అంతేగాక, దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు మోర్తాడ్ గడ్డపై నుంచే మొట్టమొదటిసారిగా కేసీఆర్ పింఛను మంజూరు చేశారని గుర్తుచేశారు. నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్ల భారాన్ని తగ్గించేందుకు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ. 1,00,116 అందించడమే కాకుండా, తాగునీటి కోసం మహిళలు పడుతున్న గోసను తీర్చేందుకు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటి ముంగిటకే నల్లా నీటిని తీసుకొచ్చారని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచుతూ నాణ్యమైన వైద్యాన్ని, ప్రసవానంతరం 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్, రూ. 12,000 ఆర్థిక సాయం, న్యూట్రిషన్ కిట్లతో పాటు పేద విద్యార్థులకు గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య, సన్నబియ్యం భోజనాన్ని అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని, ఎల్బీ స్టేడియంలో తొలి సంతకం పెడతామని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ప్రజలను నట్టేట ముంచారని వేముల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంటింటికీ తిరిగి ఇచ్చిన గ్యారెంటీ కార్డులను వేదికపై ప్రదర్శిస్తూ ప్రభుత్వం ప్రజలకు పడ్డ బకాయిల లెక్కలను ఎమ్మెల్యే వివరించారు.
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇప్పటివరకూ గడిచిన సమయానికి లెక్కగడితే ప్రతి మహిళకు ప్రభుత్వం రూ. 82,500 బాకీ పడింది.
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికుల పింఛను రూ. 2,000 నుంచి రూ. 4,000కు పెంచుతామని చెప్పి ఎగ్గొట్టారు. పెంచాల్సిన రూ. 2,000 చొప్పున ప్రతి పింఛన్దారునికి ప్రభుత్వం సుమారు రూ. 66,000 బకాయి పడింది. అలాగే దివ్యాంగులకు రూ. 6,000 పింఛన్ ఇవ్వకుండా మొండిచేయి చూపారు.
ప్రతి ఇంటికీ రూ. 500కే సిలిండర్ ఇస్తామని చెప్పి, క్షేత్రస్థాయిలో మెజారిటీ ప్రజలకు మొండిచేయి చూపారు. రాయితీ మొత్తం కింద ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సుమారు రూ. 16,500 బాకీ ఉంది.
కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ. 1,00,116తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మాట తప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బాల్కొండ నియోజకవర్గంలోనే సుమారు 5,000 మంది ఆడబిడ్డల పెళ్లిళ్లు జరగ్గా, ఒక్కరికీ తులం బంగారం అందలేదు.
ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం పేరుతో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను తీవ్ర మోసానికి గురిచేస్తోందని వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. 200 యూనిట్ల లోపు వాడకం ఉన్నప్పుడు ఉచితం ఇచ్చి, వేసవిలో వాడకం 200 యూనిట్లు దాటితే టారిఫ్ రేట్లను రెట్టింపు చేసి వేల రూపాయల బిల్లులను బలవంతంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నిరంతరాయంగా 24 గంటల కరెంట్ లభిస్తే, ప్రస్తుత పాలనలో రోజుకు నాలుగైదు సార్లు కరెంట్ కోతలు విధించడం శోచనీయమన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టి, ఆర్టీసీ బస్సు సర్వీసులను సగానికి తగ్గించారని, పల్లెల్లో రద్దీ పెంచి పురుషులపై చార్జీలను రెట్టింపు చేసి కుటుంబాలపైనే అంతిమ భారం మోపుతున్నారని విమర్శించారు.
ఎన్నికల సమయంలో రాష్ట్ర బడ్జెట్, అప్పుల స్థితిగతులపై అవగాహన ఉందని వీడియోల్లో స్వయంగా చెప్పిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు.. ఇప్పుడు అధికారం చేపట్టాక కేసీఆర్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ గారు చేసిన అప్పులతో కాళేశ్వరం, మిషన్ భగీరథ, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన స్వల్ప కాలంలోనే సుమారు రూ. 4 లక్షల కోట్ల అప్పులు చేసి ఒక్క రోడ్డు గుంత పూడ్చలేదని, ఒక్క చెరువు తవ్వలేదని ఎద్దేవా చేశారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను నమ్మించి, మూడేళ్లలో కేవలం 17 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తూ అధికారులు ఏకపక్షంగా జాబితాలు రూపొందిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో మోర్తాడ్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రూపాయి లంచం లేకుండా పేదలకు తాళాలు అందజేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం కేటాయించే ఇందిరమ్మ ఇళ్లను పారదర్శకంగా ప్రజలందరి సమక్షంలో ‘లక్కీ డ్రా’ ద్వారా మాత్రమే అర్హులైన పేదలకు అందించాలని, లేనిపక్షంలో ఊరుకోబోమని హెచ్చరించారు.
మహిళా సదస్సులో ఏకగ్రీవ తీర్మానాలు – ప్రభుత్వానికి డిమాండ్లు:
సభకు వేలాదిగా తరలివచ్చిన మహిళల ఆమోదంతో చేతులెత్తించి ప్రభుత్వానికి పలు కీలక డిమాండ్లను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విడుదల చేశారు
1. పేద బాలింతలకు ఆసరాగా నిలిచే కేసీఆర్ కిట్, పోషకాహార కిట్లను తక్షణమే పునరుద్ధరించాలి.
2. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 చొప్పున పేరుకుపోయిన రూ. 82,500 బకాయిలను వెంటనే జమ చేసి, వచ్చే నెల నుంచి క్రమం తప్పకుండా చెల్లించాలి.
3. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పింఛను పెంపు బకాయి రూ. 66,000 తక్షణమే చెల్లించి, నెలకు రూ. 4,000 పింఛన్ అందించాలి. అర్హులైన 57 ఏళ్లు నిండిన వారికి, కొత్త కోడళ్లకు, కొత్తగా పీఎఫ్ పొందుతున్న బీడీ కార్మికులకు నూతన పింఛన్లు వెంటనే మంజూరు చేయాలి.
4. కళ్యాణలక్ష్మి కింద పెళ్లిళ్లు చేసుకున్న ఆడబిడ్డలందరికీ ఎన్నికల్లో వాగ్దానం చేసిన తులం బంగారాన్ని వెంటనే పంపిణీ చేయాలి.
5. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన నిరుపేదలందరికీ రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని పూర్తిస్థాయిలో అందించాలి; స్థలం లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలి.
ఈ డిమాండ్ల తీర్మాన పత్రాన్ని ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపుతున్నామని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను బాకీ కార్డులతో నిలదీసి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.
తదనంతరం మహిళలతో కలిసి సహాపంక్తి భోజనం చేసారు….
ఈ కార్యక్రమంలో వేలాది గా మహిళలు స్వచ్చందంగా తరలి వచ్చారు.. అలాగే నియోజక వర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

























