అధికారులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలవాలి
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా..
ఇందూరు: ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి ప్రజాభివృద్ధికి కృషి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని శ్రీరామ గార్డెన్ లో నియోజకవర్గ స్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నగరపాలక సంస్థలో అన్ని విభాగాల ఉద్యోగులు సమన్వయంతో పని చేస్తూ రాష్ట్రంలోనే నిజామాబాదును మొదటి స్థానంలో నిలపాలన్నారు. ప్రజలు చెప్పే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అలాగే శాఖ పరంగా ఏదైనా సమస్యలు వస్తే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల పనితనం మెరుగుపడాలని, ప్రతి శాఖాధికారి ప్రజలకు జవాబుదారిగా ఉండాలన్నారు.
ఆబ్కారీ శాఖ బెల్ట్ షాపులను కట్టడి చేసేందుకు కృషి చేయాలన్నారు. చాలామంది మద్యానికి బానిసలై విలువైన ఇతలను నాశనం చేసుకుంటున్నారు అన్నారు. విద్యాశాఖ పరంగా పేద విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. నగరంలో అనేక అంగన్వాడి కేంద్రాలు అద్దె భవనంలో కొనసాగుతున్నాయని, వాటిని సొంత భవనంలోకి మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ఈ కార్యక్రమమైన నామమాత్రంగా కాకుండా.. ప్రజలకు మేలు కలిగేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి, నూడా చైర్మన్ కేశ వేణు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, ఎర్రం సుధీర్, జగదీష్ కులకర్ణి, పసునూరి రాము, శ్రావణ్ కుమార్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

























