భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యత గురువులదే
విద్యా విజయోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే, కలెక్టర్ వెల్లడి
ఇందూరు : చక్కటి విద్యా బుద్ధులు నేర్పించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్ధవంతంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజులో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా వారోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆదివారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ..భావి భారత పౌరులైన విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత గురువులదేనన్నారు. అందుకే సమాజంలో గురువులకు ఎంతో గౌరవం, గొప్ప స్థానం ఉందని గుర్తు చేశారు. 2047 వరకు భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దాలనే ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పాన్ని సాకారం చేసేవిధంగా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. ఏ లక్ష్య సాధనకైనా చదువు ఎంతో తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. విద్యారంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్న ఫలితంగా ప్రైవేట్, కార్పోరేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు నమోదు చేస్తున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ బడుల విద్యార్థులు సాధించిన ఫలితాలే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. అయితే విద్యార్థులు కేవలం మార్కుల సాధనకే పరిమితం కాకుండా, నాణ్యమైన విద్యను ఆర్జించాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్ధి దశ ఎంతో కీలకమని అన్నారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, కలలను సాకారం చేసుకునే దిశగా నిజాయితీతో ముందుకు వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. భవిష్యత్తులో స్థిరపడేందుకు పదవ తరగతి తరువాత ఎంచుకునే మార్గం ఎంతో కీలకం అయినందున, ఇష్టమైన సబ్జెక్టులతో కూడిన కోర్సులలో చేరాలన్నారు. ఎంచుకున్న గమ్యాన్ని ఎలా చేరుకోవాలి అనే దానిపై స్పష్టత కలిగి ఉండాలని, ఆ దిశగా అంకిత భావంతో కృషి చేస్తే తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోగల్గుతారని అన్నారు. స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడకుండా పుస్తక పఠనంను అభిరుచిగా మల్చుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందజేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, డీఈవో అశోక్, బీ.సీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు నర్సయ్య, కృష్ణవేణి, జిల్లా పౌర సంబంధాల అధికారిణి ఎన్.పద్మశ్రీ, డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య, జీఈసీఓ భాగ్యలక్ష్మి, ఎం.ఈ.ఓలు, హెచ్.ఎంలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

























