బీఆర్ఎస్ చేసిన పాపాలే రాష్ట్రానికి శాపాలయ్యాయి: మానాల మోహన్ రెడ్డి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్ అభివృద్ధిపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో భీంగల్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన అన్నారు. పీసీసీ అధ్యక్షుడి కృషి వల్లే భీంగల్లో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతమయ్యాయని, ఇతర అభివృద్ధి పనులు కూడా ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
వెజిటబుల్ మార్కెట్కు 2021లో, 100 పడకల ఆస్పత్రికి 2022లో శంకుస్థాపన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ వాటిని ఎందుకు పూర్తి చేయలేదో ప్రశాంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అలాగే, ఎన్నికల నోటిఫికేషన్కు కేవలం 15 రోజుల ముందు భీంగల్ బస్సు డిపోను ప్రారంభించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేశారో కూడా వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు.
భీంగల్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రశాంత్ రెడ్డి ముసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం రూ.28 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వాటిలో రూ.7 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని, రూ.4 కోట్ల పనులు కొనసాగుతున్నాయని, మరో రూ.15 కోట్ల పనులు ఒప్పంద (అగ్రిమెంట్) దశలో ఉన్నాయని వెల్లడించారు.
ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రశాంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని, భీంగల్ అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మానాల మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

























