ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలి: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి…
ఆహార పదార్థాలు, ఔషధాల్లో కల్తీలను అరికట్టేందుకు కఠినమైన చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, పాలు తదితర ఆహార పదార్థాల్లో పెరుగుతున్న కల్తీ కారణంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (TGFADCA) రూపకల్పనపై ఎంసీహెచ్ఆర్డీ బోధి పేవిలియన్లో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ముఖ్యమంత్రి చేసిన కీలక సూచనలు:
ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు, పండ్లు త్వరగా పక్వానికి రావడానికి విచ్చలవిడిగా రసాయనాలు వినియోగించడం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.
ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం వల్ల పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు పెరుగుతున్నాయని, ఈ కారణంగా కొన్ని దేశాలు మన వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను నిరాకరిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
మార్కెట్లో సేంద్రియ (ఆర్గానిక్) ఉత్పత్తులు పేరుతో అనేక వస్తువులు విక్రయిస్తున్నప్పటికీ, అవి నిజంగా సేంద్రియ ఉత్పత్తులేనని నిర్ధారించే సమర్థమైన వ్యవస్థ ప్రస్తుతం లేదని తెలిపారు.
కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు అమలు చేస్తున్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఆ అధ్యయనాల ఆధారంగా సమగ్ర నివేదిక సిద్ధం చేసి, దాని ప్రకారం బిల్లును రూపొందించి శాసనసభలో విస్తృత చర్చ చేపట్టాలని ఆదేశించారు. ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరించాలని సూచించారు.
కల్తీలపై సమాచారం అందించేందుకు విజిల్ బ్లోయర్ వ్యవస్థతో పాటు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కల్తీల నిరోధానికి క్యూర్ (CURE) ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, అక్కడ నిబంధనలను అమలు చేసి వచ్చిన అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు వి. శేషాద్రి, ఎన్. శ్రీధర్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

























