బహుళజాతి కంపెనీలు రావాల్సిన అవసరం ఉంది: ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయ…
ఇందూరు: నిజామాబాద్ టీ-హబ్లో బహుళజాతి (మల్టీనేషనల్) కంపెనీలు స్థాపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు.
నగర శివారులోని బైపాస్ రోడ్డులో ఉన్న టీ-హబ్లో ఎన్ఎన్ ఏఐ సొల్యూషన్స్ స్టార్టప్ కంపెనీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, మంచి కంపెనీలు జిల్లాకు వస్తే ఇందూరు యువత ఉద్యోగాల కోసం ఇతర నగరాలు, రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు.
ఈ విషయమై ఇటీవల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసి నిజామాబాద్లో మరిన్ని ఐటీ, బహుళజాతి సంస్థలను ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, వచ్చే వారంలో నిజామాబాద్కు వచ్చి టీ-హబ్ పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
నిజామాబాద్ యువతలో అపారమైన ప్రతిభ ఉందని, వారికి స్థానికంగానే మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. ప్రస్తుతం టీ-హబ్లో కేవలం 12 కంపెనీలు మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఇప్పుడు తొలి ఏఐ ఆధారిత స్టార్టప్ కంపెనీ ప్రారంభం కావడం సంతోషకరమైన విషయమని అన్నారు.
ప్రస్తుతం ప్రపంచం కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ముందుకు సాగుతోందని, ఈ రంగానికి చెందిన సంస్థలు జిల్లాలో ఏర్పడడం ద్వారా స్థానిక యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఎన్ఎన్ ఏఐ సొల్యూషన్స్ సీఈవో నజీబుద్దీన్, బీజేపీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






















