పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మీసాల శ్రీనివాసరావు…
నిజామాబాద్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలో నిజామాబాద్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ నుంచి మాధవనగర్లోని సుగుణ గార్డెన్స్ వరకు జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సుగుణ గార్డెన్స్లో జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ జనసేన పార్టీ ఇన్చార్జ్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనే అంశంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు చేసిన వ్యాఖ్యలను తాము పరిగణనలోకి తీసుకోబోమని, పొత్తులపై జాతీయ స్థాయిలో ఇరు పార్టీల నాయకత్వాలు నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు.
జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తే ఎంతో మంది కార్మికులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల సమస్యలను జనసేన పార్టీ ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతుందని తెలిపారు.
తెలంగాణలోని ప్రతి ప్రాంతంలో ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం జనసేన పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందని అన్నారు. ఎన్నికల సమయంలోనే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
కాగా, జనసేన రాష్ట్ర నాయకుడు, మీసాల ఫౌండేషన్ చైర్మన్ మీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హీరో తనీష్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

























