సంగారెడ్డి జిల్లా మంత్లీ క్రైమ్ రివ్యూ సమావేశం…
• ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి, బాధితులకు అండగా నిలవాలి.
• లాంగ్ పెండింగ్, మిస్సింగ్ కేసుల ఛేదన, ఎన్బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్కు ప్రత్యేక ప్రణాళిక ఉండాలి.
• రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి.
• విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేత.
• మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ లో అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ సదాశివ్ బచ్చగొని…
సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్. దర్యాప్తులో నాణ్యత, పెండింగ్ కేసుల పరిష్కారం, ఎన్బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్, రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజా భద్రత, కమ్యూనిటీ పోలీసింగ్, అవగాహన కార్యక్రమాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా వివిధ పోలీస్ స్టేషన్లలో దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్, మిస్సింగ్, ఎన్బీడబ్ల్యూ కేసుల పురోగతిని సమీక్షించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లాంగ్ పెండింగ్ కేసులు, మిస్సింగ్ కేసుల ఛేదన, ఎన్బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని, నిర్ణీత గడువులోగా దర్యాప్తును పూర్తి చేయాలని సూచించారు.
గ్రేవ్ కేసుల్లో శాస్త్రీయ ఆధారాలను సేకరించి, నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టాలని అన్నారు. నిజమైన దోషులకు న్యాయస్థానంలో శిక్ష పడినప్పుడే ప్రజల్లో పోలీసులపై నమ్మకం మరింత పెరుగుతుందని అన్నారు. దర్యాప్తులో సాంకేతిక లేదా న్యాయపరమైన సందేహాలు ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఏర్పాటు చేసిన షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తూ, మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టడంతో పాటు మహిళా చట్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు అధికంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయించాలని అధికారులకు సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో గ్రామ స్థాయిలో సమాచార సేకరణ అత్యంత కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. విలేజ్ పోలీస్ అధికారులు గ్రామ ప్రజలు, యువతతో సత్సంబంధాలు కలిగి, ముందస్తు సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఆయా గ్రామాల్లో రౌడీషీటర్లు, కేడీలు, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. నేర దర్యాప్తులో కీలకంగా ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, ప్రతి గ్రామంలోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లతో పాటు ప్రార్థనా స్థలాలు, పరిశ్రమలు, ధాబాలు, పెట్రోల్ బంకులు తదితర కీలక ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్హెచ్ఓలకు సూచించారు.

వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా నగదు రివార్డులు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. అలాగే పోలీస్ స్టేషన్ల స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులకు, సిబ్బందికి రివార్డులు, ప్రశంసాపత్రాల కోసం సిఫారసు చేయాలని ఎస్హెచ్ఓలకు సూచించారు.
అనంతరం అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్. ఎస్హెచ్ఓలకు కేటాయించిన పోలీసు వాహనాల స్థితిగతులను పరిశీలించారు. ప్రతి వాహనానికి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉంచాలని డ్రైవర్లను ఆదేశించారు. వాహనాల్లో అవసరమైన ఎమర్జెన్సీ కిట్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. వాహనాలను పరిశుభ్రంగా, మంచి స్థితిలో నిర్వహిస్తున్న డ్రైవర్లను ప్రత్యేకంగా అభినందించి, వారికి రివార్డులు ప్రకటించారు.
ఈ నెలవారీ నేర సమీక్షా సమావేశంలో డీఎస్పీలు సత్యయ్య గౌడ్, వెంకట్ రెడ్డి, సైదా నాయక్, ప్రభాకర్, సురేందర్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, జిల్లా ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు సురేష్, రాజశేఖర్ రెడ్డి, సబ్ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

























