*సానుకూల ఆలోచనలను ఉత్తేజపరచేవి భజనలే…!*
గురువారం : 02/07/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
అవధూత గోవిందగిరి దివ్య యోగాశ్రమము వేల్పూర్ లో గురువారం సందర్భంగా భజన భక్త బృందాలు చక్కటి భజనలు చేశారు. అంక్సాపూర్ గ్రామానికి చెందిన భట్టాపూర్ లక్ష్మి శ్రీనివాస్ గౌడ్ కండక్టర్ దంపతులు అన్నదాతలుగా ప్రకటించుకున్నారు. ధ్యాన మందిరం నుండి భజనలు చేస్తూ మహిళా మణులు, భక్తులు మంగళహారతులు చేభూని పల్లకి ముందు నడువగా, భజన బృందాల వారు అర్థవంతమైన భజన గీతాల్ని ఆలపిస్తూ లింగ బేధం లేకుండా ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ భజన కీర్తనలు పాడడం లేదా వినడం వల్ల మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. ఒత్తిడి తగ్గి నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. ఇవి ఆధ్యాత్మిక భావనను పెంపొందించి, ఏకాగ్రతను పెంచి, సానుకూల ఆలోచనలను ఉత్తేజ పరుస్తాయి. భజనలలో లయబద్ధమైన రాగాలు, స్వరాలు మెదడును ప్రశాంతపరిచి, ఒత్తిడిని కలిగించే హార్మోన్లను తగ్గిస్తాయి. కీర్తనలు పఠించడం లేదా వినడం వల్ల ధ్యానం చేసినంత ప్రశాంతత లభిస్తుంది. ఇవి మనసులోని ఆలోచనలను నియంత్రించి ఏకాగ్రతను పెంచుతాయి. భజనల ద్వారా వెలువడే దివ్యమైన ప్రకంపనలు మనసును ఉత్తేజపరుస్తాయి. ప్రతికూలతలను దూరం చేసి ఆనందం, ప్రేమ, ప్రశాంతతను అందిస్తాయి. భజనలు సామూహికంగా చేయడం వలన ప్రజల మధ్య సామాజిక బంధాలు, ఐక్యత, సామరస్య భావాలు పెంపొందుతాయి అని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సీతారాం పల్లెకు చెందిన సాయి సేవకులు, భజన బృందాలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.























